Panchayati Elections | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించకపోవటంపై సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖ లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఈసీని ఆదేశించింది. సర్పంచుల పదవీకాలం ముగిసిపోతున్నా ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవటాన్ని తప్పుపడుతూ జనగామ జిల్లా కాంచనపల్లి, చెంగెర్ల, నిర్మల జిల్లా తల్వాడ, కరీంనగర్ జిల్లా నిజాయతీగూడెం సర్పంచులు విజయవేణుగోపాల్, అనిల్కుమార్, మురళీధర్ ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయని, వీరి పదవీకాలం బుధవారంతో ముగిసిందని తెలిపారు.
పదవీకాలం ముగిసేనాటికి ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాం గం నిర్దేశించినా, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా సజావుగా పనిచేయటం లేదని, ప్రభుత్వానికి లోబడి వ్యవహరిస్తున్నదని వెల్లడించారు. సర్పంచుల పదవీకాలం ముగియటానికి ఆర్నెల్ల ముందే ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు చేపట్టాలని, కనీసం ఓటర్ల జాబితానైనా సిద్ధం చేసి ఉండాల్సిందని వివరించారు. గురువారం నుంచి పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్తున్నాయని, దీన్ని అడ్డుకోవాలని కోరారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత సర్పంచులనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. వాదనల అనంతరం సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణకు తీసుకునే చర్యలను వివరించాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆయా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.