హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాలు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వాటిని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకునేదీ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
పిల్లల అదృశ్యంపై ఈ నెల 11న పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా చేపట్టింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ అలోక్ అరాథే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. ఇది తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.