హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ఔట్ నోటీసును ఉపసంహరించుకున్నట్టు ఏపీ సీఐడీ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. లుక్ఔట్ నోటీసును రద్దు వివరాలను ఇండియన్ ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు ఈ-మెయిల్ చేసినట్టు వివరించింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా లుక్ఔట్ నోటీస్ పంపడంపై క్షమాపణలు కోరారా? లేదా? అనేది అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీని జస్టిస్ కే సురేందర్ శుక్రవారం ఆదేశించారు.
గత మార్చి 21న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఏపీ సీఐడీ లుక్ఔట్ నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మార్గదర్శి సంస్థ ఎండీ శైలజ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరైన ఏపీ సీఐడీ డీఎస్పీ రాజశేఖర్రావు తదుపరి విచారణకు కూడా హాజరుకావాలని కోర్టు సూచించింది.