హైదరాబాద్ : హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తులు, అడిషనల్ ఏజీ జె.రామచందర్ రావుతో కలిసి ఎంపీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ..తాను రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు గుర్తు చేసారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
అనంతరం ఎంపీ సంతోష్ మాట్లాడుతూ..హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జజిఖాన్ ప్రసూతి దవాఖిన ప్రాంగణంలో సీజే సతీష్ చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ సీజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయమూర్తి కి వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు.
కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు, జీపీలు జోగినిపల్లి సాయి కృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.