హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అవినీతికి తావులేకుండా, రాగద్వేషాలకు అతీతంగా, చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి, పలుకుబడికి లొంగి ఇచ్చే న్యాయ నిర్ణయాల వల్ల ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టులకు ఎంపికైన 66 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు శిక్షణలో భాగంగా బుధవారం తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీతి, నిజాయితీగా, చట్టానికి మాత్రమే జవాబుదారీ అనుకొని విధులు నిర్వర్తిస్తే న్యాయవ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు గిట్టనివాళ్లు ఫిర్యాదులు చేసినా రాష్ట్ర న్యాయవ్యవస్థ అధినేతగా తాను రక్షకుడిగా ఉంటానని భరోసా ఇచ్చారు. గొప్ప జడ్జీలుగా ఎదగాలంటే సోక్రటీస్ చెప్పినట్టు మర్యాదగా వినటం, విజ్ఞతతో కూడిన వినయపూర్వక జవాబు ఇవ్వటం, ఒత్తిళ్లకు ప్రభావితం కాని ఆలోచనలు, నిష్పక్షపాత తీర్పులు ఉండాలని పిలుపునిచ్చారు. మనం ప్రజల డబ్బును జీతాలుగా తీసుకొంటున్నామని, చెప్పే తీర్పుల ద్వారానే ప్రజలు మనలో దేవుడిని చూస్తారని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థకు పునాది, వేళ్లు జిల్లా జ్యుడీషియరీయేనని, అన్ని స్థాయిల్లోనూ కొందరు సమయపాలన అవలంబించకపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులోనే 2.70 లక్షల పెండింగ్ కేసులున్నాయని, జిల్లా జ్యుడీషియరీలో కూడా పెండింగ్ కేసులు బాగా ఉన్నాయని, వాటి పరిషారం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.శిక్షణ పొందిన జూనియర్ సివిల్ జడ్జీల్లో సగానికిపైగా మహిళలు ఉండటంపై చీఫ్ జస్టిస్ హర్షం వ్యక్తం చేశారు. ఆ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేయవద్దని అనగానే నవ్వులు పూశాయి. కాగా, తొలుత కొత్త జూనియర్ సివిల్ జడ్జీలతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్రెడ్డి ప్రమాణం చేయించారు. మినిస్టీరియల్ ఆఫీసర్స్ గైడ్ను చీఫ్ జస్టిస్ ఆవిషరించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ ఎ వెంకటేశ్వర్రెడ్డి, న్యాయాధికారులు హాజరయ్యారు.