హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం రద్దు చేసుకునేవారు తమ రిజర్వేషన్ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తున్నది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ రిజర్వేషన్ టికెట్ను బదిలీ చేయొచ్చు.
రిజర్వేషన్ బదిలీ ఇలా…
సాధారణ ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా చేస్తేనే మరొకరి పేరిట టికెట్ బదిలీ అవుతుంది. ఉద్యోగులైతే పండుగలు, పెండ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎన్సీసీ క్యాడెట్లకూ ఇది వర్తిస్తుంది. టికెట్ను తన పేరిట బదిలీ చేయించుకునే ప్రయాణిలు వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఐడీకార్డు సమర్పించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ బదిలీ ప్రక్రియ ఇదీ
రిజర్వేషన్ టికెట్ బదిలీ ప్రక్రియ దశలవారీగా ఉంటుంది. టికెట్ ప్రింట్ అవుట్ తీసుకొని సమీప రైల్వేస్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లాలి. టికెట్ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీకార్డ్ వంటి ఐడీతోపాటు టికెట్ బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి ఐడీ కాపీ తప్పనిసరి ఉండాలి.