హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 15 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కోడిగూటి శారద ప్రవీణ్ బాలికలకు బీమాతో ధీమా కల్పించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు చదువుకునే 30 మంది నిరుపేద బాలికలకు గురువారం ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున తన సొంత ఖర్చుతో ఎల్ఐసీ పాలసీలు చేయించారు.
ఇది న్యూ ఎండోమెంట్ పాలసీ అని, ఒక్కో విద్యార్థికి రూ.5,500 చొప్పున 17 ఏండ్లు చెల్లిస్తే 18వ సంవత్సరం రూ.3 లక్షల వరకు విద్యార్థులకు వస్తాయని మాజీ సర్పంచ్ శారద ప్రవీణ్ తెలిపారు. కనీసం రెండేండ్లు బీమా చెల్లించిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారని పేర్కొన్నారు.
వీరి ప్రీమియాన్ని ఏటా తామె చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కొందరికి గురువారం ఎల్ఐసీ బాండ్స్ అందజేశారు. మిగతా వారికి మార్చి 5లోగా బాండ్స్ అందజేస్తానని తెలిపారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మాజీ సర్పంచ్ దంపతులు పేర్కొన్నారు.