మొదటి విడుత లబ్ధ్దిదారులు 1,24,704
రెండో విడుత లబ్ధ్దిదారులు 83,993
మొత్తం లబ్ధిదారులు 2,08,697
అందజేసే నగదు 42 కోట్లు
సన్నబియ్యం 5,225 మెట్రిక్ టన్నులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ సాయాన్ని ఈ నెల 15లోగా అందించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఈ నెల 13వ తేదీలోపు ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఫైల్ను ఆర్థికశాఖకు పంపించి రూ.2 వేలు అకౌంట్లలో, రేషన్ షాపుల ద్వారా 25 కిలోల సన్నబియ్యాన్ని అందజేయనున్నట్టు వెల్లడించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూ-డైస్)లో నమోదుకాని 83 వేల మంది టీచర్లు, సిబ్బందికి సైతం మానవీయ కోణంలో సాయం చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ఈ సాయం అందుతుందని మంత్రి స్పష్టంచేశారు. ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం దేశంలో తెలంగాణలోనే ప్రథమమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆపదలో ఉన్న వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
మొదటివిడతలో 1.25 లక్షల మంది
మొదటివిడతలో 1.25 లక్షల మందిని ఎంపికచేసి రూ.25 కోట్ల నగదు అందజేశారు. మరో 1.13 లక్షల మందికి 2,840 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. రేషన్షాపు వివరాలు సక్రమంగా లేకపోవడంతో 11,819 మందికి బియ్యం అందలేదు. వారికి సైతం ప్రస్తుతం అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. తాజా లబ్ధిదారులు 83,993 మందిని కలుపుకుంటే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,08,697 చేరనున్నది. వీరిలో ప్రైవేట్ స్కూళ్ల వారేకాకుండా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ టీచర్లు, సిబ్బంది సైతం ఉన్నారు. కాగా, ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి సాయమందిస్తున్నట్టుగానే విద్యావలంటీర్లు, సర్వీస్ పర్సన్లకు కూడా సాయం అందించాలని టీఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందూరి రాజిరెడ్డి, మహ్మద్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు.
అదనంగా పంపిణీకి బియ్యం సిద్ధం: పౌరసరఫరాలశాఖ
కరోనా ఆపత్కాలంలో తెల్లరేషన్ కార్డుదారులకు అదనంగా 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాలశాఖ సిద్ధమవుతున్నది. మరో 80 వేల మంది ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ రేషన్ షాపులకు బియ్యం తరలించడంపై చర్యలు చేపట్టింది. తెల్లరేషన్కార్డుదారులకు, ప్రైవేటు టీచర్లకు అదనపు కోటా బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ప్రతినెలా రూ.60 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లరేషన్కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సుమారు రూ.45 కోట్లు, ప్రైవేటు స్కూల్ సిబ్బందికి రూ.16 కోట్లు అవసరమవుతాయని అంచనా.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
కట్టంగూర్(నకిరేకల్)/కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 10: కరోనాతో స్కూళ్లు మూతపడి ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేలు, 25 కిలోల బియ్యం అందిస్తున్నది. గతంలో 1.25 లక్షల మందికి సాయం అందించగా.. మిగిలిన 80 వేల మందికి అదే విధమైన సాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేస్తూ సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో ట్రస్మా రాష్ట్ర నాయకుడు కందాల పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్స్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంపట్ల ట్రస్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్రావు, ఎస్ మధుసూదన్, ఈవీ రమణారావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.