నేటి నుంచి అధికారుల హెలికాప్టర్ పర్యటన
కట్టడి చర్యల్లో అధికారుల నివేదికలు కీలకం
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి, తీరుతెన్నులపై నిశితంగా పరిశీలిస్తున్నది. ఇతర రాష్ట్రాలతోపాటు వాటితో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మొదటి, రెండో వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తి దాదాపు సరిహద్దు జిల్లాల నుంచే జరిగిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలైతే, ఇప్పుడు కూడా అదే విధంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం నుంచి మూడు రోజులపాటు హెలికాప్టర్లో పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు.
సరిహద్దులో కట్టడి చర్యలు ముఖ్యం
మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ట్రాలు తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నాయి. దాదాపు ఇవి 18 జిల్లాలు వరకు ఉన్నాయి. ఇందులోని పలు జిల్లాల్లో కేసులు ఇతర జిల్లాలతో పోల్చితే కొంత ఎక్కువగా నమోదవుతుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునాసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో అధికారులు హెలికాప్టర్ ద్వారా పర్యటించనున్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగే ఈ పర్యటనలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను అధ్యయనం చేసి నివేదికను క్యాబినెట్కు సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ మొదటివారంలోనూ వైద్యాధికారులు హెలికాప్టర్ ద్వారా పర్యటించారు. ఆ నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యలతో రెండో వేవ్ వైరస్ కట్టడి సాధ్యమైంది.
నేటి నుంచి వైద్యాధికారుల హెలికాప్టర్ పర్యటన ఇలా..
ఆదివారం : నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం
సోమవారం : డోర్నకల్, హుజూరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి
మంగళవారం : సిరిసిల్ల, వరంగల్