ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ): మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. మేడారం మహా జాతరకు 2016 జాతర నుంచి హెలిక్యాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత జాతరలో ఒక్కో భక్తుడికి హనుమకొండ నుంచి మేడారం వరకు టికెట్ ధర రూ.4 వేలు వసూలు చేశారు.
ప్రస్తుత జాతర సందర్భంగా ప్రైవేటు ఏవియేషన్ ద్వారా టికెట్ ధరను నిర్ణయించనున్నారు. మేడారంలో హెలికాప్టర్లు దిగేందుకు ఇప్పటికే అధికారులు 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో విహంగ వీక్షణానికి ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరలను త్వరలో నిర్ణయించి ప్యాకేజీని ప్రకటించనున్నారు.