సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 17 : జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 600 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఎస్ఐ మారుతి తెలిపారు.
కాగా, నిందుతుడు గుగులోతు పాండు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి మాట్లాడుతూ..పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా శనివారం రాత్రి రామచంద్రపురంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తంగళ్లపల్లి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తంగళ్లపల్లి ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ప్రమోద్, అక్షర్ ఉన్నారు.