హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని పేర్కొన్నది. రుతుపవనాలు గత ఏడాది గత ఏడాది జూన్ 11న రాష్ట్రంలో ప్రవేశించగా, ఈ సారి (జూన్ 5న) వారం రోజులు ముందుగా వచ్చాయి. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని తెలిపింది. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నదని వివరించింది. అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ముఖ్యంగా 12న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. 13న కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
పలు జిల్లాల్లో జోరువాన
రాష్ట్రంలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం నాగారంలో 14.80 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా దామెరలో 14.10, వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో 13.63, హసన్పర్తి మండలం చింతగట్టులో 13.43, కామారెడ్డి జిల్లా దోమకొండలో 12.38, హన్మకొండలోని ములుగు రోడ్డులో 11.28, ఖిల్లా వరంగల్లో 11.23, వరంగల్ రూరల్ జిల్లా నడికుడలో 10.95, పైడిపల్లిలో 10.85 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాలుగు గంటలపాటు కుండపోత వర్షం కురువాడంతో వరంగల్ నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. దీంతో పలు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి.