Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. పైకి వెళ్లేకొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం రెండురోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.New
ఈ క్రమంలో తెలంగాణలో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఖమ్మం, కొత్తూగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.