హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 22: వారంపాటు రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రాష్ట్రంలో మరో మారు వానలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్లో పలు చోట్ల 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసిందని టీఎస్డీపీఎస్ తెలిపింది.
‘గ్రేటర్’కు ఎల్లో అలర్ట్
ఉపరితల ఆవర్తనం, ద్రోణికితోడు షియర్జోన్ ఏర్పడటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి కుండపోత వాన కురిసింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లిలో అత్యధికంగా 12.8 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి పరిధిలోని హఫీజ్పేటలో 10.3 సెంటీమీటర్లు, గాజులరామారం, కూకట్పల్లి బాలానగర్లో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా గ్రేటర్లోని పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ఎటు చూసినా మోకాళ్ళలోతు వరద నీరు కనిపించింది. మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
వాగులో చిక్కుకున్న పాఠశాల బస్సులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ కొమ్ములవంచ మీదుగా నర్సింహులపేటకు వెళ్తున్న క్రమంలో కొమ్ములవంచ కొత్త చెరువు మత్తడిలో చిక్కుకున్నది. అప్రమత్తమైన స్థానికులు బస్సులో ఉన్న 20 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం శివారు పాలేరు వాగులో తొర్రూరుకే చెందిన మరో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు చిక్కుకుంది. గ్రామస్థులు వాగు నుంచి బస్సును వెనుకకు తోసి విద్యార్థులను కాపాడారు.
పాలేరు వాగులో చిక్కిన 23 మంది మహిళాకూలీలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని చావ్లాతండా శివారులోని పాలేరు వాగులో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన 23 మంది మహిళా కూలీలు చిక్కుకొన్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఫకీరతండాకు చెందిన 10 మంది కూలీలు దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో శుక్రవారం వరి నాటు వేయడానికి వెళ్లారు. భారీ వర్షం కారణంగా రామన్నగూడెం- ముంగిమడుగు రాకపోకలు నిలిచిపోవడంతో పది మంది మహిళలకు సర్పంచ్ నర్సయ్య రామన్నగూడెం పాఠశాలలో ఆశ్రయం కల్పించి, భోజన వసతి ఏర్పాటు చేశారు.
నాటు పడవల్లో రేషన్ బియ్యం తరలింపు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని వేమనపల్లి-సుంపుటం మధ్యనున్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ వా గును పరిశీలించారు. వాగు అవతలి వైపు ఉన్న సంపు టం గ్రామస్థులు ఇబ్బంది పడకుండా 10 నాటు పడవల్లో 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలించారు.
స్థిరంగా ఉపరితల ఆవర్తనం
ఒడిశా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబా ద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. ఒక ద్రోణి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొంకణ్ ప్రాంతం వరకు కొనసాగుతున్నదని చెప్పారు. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురువచ్చని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు.