హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, బీమా నదులకు వరద పోటెత్తుతున్నది. శనివారం పెన్గంగ ఉప్పొంగి ప్రవహించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. శుక్రవారం సాయంత్రానికి 1.38 లక్షల క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి అది 1.57 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. మూడు రోజుల్లోనే ప్రాజెక్టుకు 20 టీఎంసీలు వచ్చి చేరడం విశేషం. నిజాంసాగర్, సింగూరుతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్త తగ్గుముఖంగా పట్టింది. ప్రాణహితలో వరద ప్రవాహం తగ్గినా మళ్లీ క్రమం గా పెరుగుతున్నది. ప్రధాన గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 41.50 మీటర్ల నుంచి 40 మీటర్లకు తగ్గిపోయింది.
కృష్ణాలో క్రమంగా పెరుగుతున్న వరద
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఆల్మట్టికి శుక్రవారం సాయంత్రం 72 వేల క్యూసెక్కులు రాగా అది శనివారం సాయంత్రానికి 83 వేల క్యూసెక్కులకు, తుంగభద్రకు 13 వేల క్యూసెక్కుల నుంచి 34 వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది. భీమా ఉప్పొంగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. రాత్రి వరకు 50 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉన్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం 6 వేల క్యూసెక్కుల వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో నిలకడగా వస్తున్నది. శనివారం 3 గేట్లను 2 అడుగుల మేర నీటిని వదులుతున్నారు.
ఆదిలాబాద్లో కుండపోత
న్యూస్నెట్ వర్క్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వాన పడింది. పలు జిల్లాల్లో చిరు జల్లులు పడ్డాయి. మరికొన్ని జిల్లాలో అసలు వాన కురవలేదు. శనివారం భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడింది. శనివారం ఉదయం 6 గంటలకు 39.5 అడుగులకు తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటలకు కొద్దిగా పెరిగి 41.01 అడుగుల వద్ద ప్రవహిస్తున్నది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోనే ఉండి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరుస వర్షాలతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి శనివారం 11.55 మీటర్ల ఎత్తులో పారడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. జైనథ్ మండలం డొల్లార వద్ద వంతెనకు ఐదు ఫీట్ల కింద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నది. వంతెనను ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పరిశీలించారు. నది ప్రవాహం రాత్రికి పెరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు వంతెనపై రాకపోకలు నిషేధించారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. బంగారుగూడ వాగులో శవం కొట్టుకువచ్చింది.జూరాల ప్రాజెక్టులో జలవిద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం నాలుగు యూనిట్లలో 154 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తితో ఈ సీజన్ ప్రారంభమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
మరో నాలుగు రోజులు వానలే
రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని వెల్లడించింది.