నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్నది. గురువారం ఇన్ఫ్లో 28,40,060 క్యూసెక్కులు ఉండగా, అంతే మొత్తంలో అవుట్ఫ్లో ఉన్నది. 85 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి బరాజ్కు 10,28,916 క్యూసెక్కుల వరద వస్తున్నది.
20.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లిలో నికరంగా 15.6 టీఎంసీల నీటి మట్టాన్ని ఉంచుతూ 52 గేట్లు ఎత్తి 10,42,944 క్యూసెక్కుల నీటిని దిగువన మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్లోకి వదులుతున్నారు. పార్వతి బరాజ్ 72 గేట్లను ఎత్తి 10,35,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సారార్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.305 టీఎంసీలకు పెరగగా, రెండు గేట్లు ఎత్తి కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ రిజర్వాయర్కు 4,718 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీలో ప్రస్తుతం 11.192 టీఎంసీలకు బ్యాకప్ స్టోరేజీ పెరిగింది.
గురువారం గోదావరి నది ఉప్పొంగి 28 లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో లక్ష్మీ (కన్నేపల్లి) పంప్హౌస్లోకి వరద నీరు చేరింది. పంప్హౌస్ గేట్లు గేట్లు పగిలిపోయి నీరు లోపలికి వచ్చింది. దీంతో పంప్హౌస్లో ఉన్న 17 మోటర్లు, కంప్యూటర్లు తదితర సామగ్రి నీటిలో మునిగిపోయాయి.