Medical Colleges | విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్ 371 డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్కు సవరణ చేసినట్టు పేర్కొన్నది. గతంలో కన్వీనర్ కోటాలో స్థానిక విద్యార్థులకు 85శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ కేటగిరీ. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు.
తాజా నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. కొత్త మెడికల్ కాలేజీలలో 15శాతం ఆలిండియా కోటా యధాతథంగా ఉండనున్నది. ఇందులో తెలంగాణ, ఏపీతోపాటు దేశంలో ఎక్కడి విద్యార్థులైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో ఓ మెడికల్ కాలేజీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ఈ సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి.
ఇందులో అన్ రిజర్వుడ్ కోటాగా 15శాతం అంటే.. 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఏపీ విద్యార్థులకు అవకాశాలుండేవి. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ప్రస్తుతం రాష్ట్రంలో సీట్ల సంఖ్య 56కు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 36 కొత్త కాలేజీలు వచ్చాయి. సీట్ల సంఖ్య 8,340కు పెరిగింది. పాత విధానమే కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తున్నది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది.
కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ ‘బీ’ కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు లభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కలిపి ఏటా తెలంగాణ విద్యార్థులకు మొత్తం 1820 సీట్లు దక్కనున్నాయి. కాలేజీలు పెరిగిన కొద్దీ ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనున్నది.
విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఏండ్ల నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిర్ణయాలు.. ఎంబీబీఎస్ చదువును దగ్గర చేస్తున్నాయన్నారు. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం అదనంగా 1,820 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు వచ్చేలా చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్ కావాలనే కలను విద్యార్థులు సాకారం చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎకువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దకేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంన్నదని, 2023-24లో దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో తెలంగాణలో అందుబాటులోకి వచ్చినవి 43శాతం. దేశవ్యాప్తంగా 2118 ఎంబీబీఎస్ సీట్లు రాగా, 900 సీట్లు రాష్ట్రంలో వచ్చినవేనన్నారు.