Pink Eye | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కండ్లకలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదం ఏమీ లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. కండ్లు ఎర్రబడటం, నీరుకారడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. చికిత్సలో వినియోగించే కంటిచుక్కలు, ఆయింట్మెంట్లు, అవసరమైన మందులను పీహెచ్సీ, బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల స్థాయి నుంచి అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
పలు జిల్లాల్లో కండ్లకలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్రావు మం గళవారం సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సూపరింటెండెం ట్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కండ్లకలక, సీజనల్వ్యాధుల అప్రమత్తతపై చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కండ్లకలక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇన్ఫెక్షన్ సోకిన వారిని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గుర్తించి సమీప దవాఖానల్లో చికిత్స అందే లా చూడాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత గురించి అవగాహన పెంచాలని చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, వారు వాడిన టవల్స్, బెడ్షీట్స్, కర్చీఫ్, దిండ్లు వంటివి ఇతరులు వినియోగించకపోవడం వల్ల వ్యాప్తిని నివారించవచ్చని చెప్పా రు. మరింత ఎకువ మందికి వైద్యసేవలు అందించేలా సరోజినీదేవి కంటి దవాఖానలో ఓపీ వేళలు పెంచాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కొనసాగించాలని చెప్పా రు. ప్రభుత్వం సరఫరా చేసిన ఎయిర్ఫిల్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూ చించారు. ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్ పనితీరును డీఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్లు మానిటరింగ్ చేయాలని, అక్కడ అందుతున్న వైద్యసేవల గురించి మహిళలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
కండ్లకలక లక్షణాలు : కండ్లు ఎర్రబడటం, నీరు కారడం,వాపు రావడం
వ్యాప్తి నివారణ : ఇన్ఫెక్షన్ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, వారు వాడిన టవల్స్, బెడ్షీట్స్, కర్చీఫ్, దిండ్లు వంటివి ఇతరులు వినియోగించకపోవడం.
ఎంపీహెచ్ఏ ఫిమేల్ (ఏఎన్ఎం) పరీక్ష నిర్వహణ విషయంలో ఏఎన్ఎంల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని, వారి కోరిక మేరకు పరీక్షను ఇంగ్లిష్తోపాటు తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేయాలని సూచించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి తగిన వెయిటేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. బుధవారం తెలంగాణ స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించే 5,204 స్టాఫ్నర్సు ఆన్లైన్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.