ఖమ్మం : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్రామ్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్లో గల జగ్జీవన్ రాం విగ్రహానికి, గట్టయ్య సెంటర్ లోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత జగ్జీవన్రామ్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని మనమంతా స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించాలన్నారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడ చైర్మెన్ విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.