హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా హంద్రినీవా, గాలేరునగరి సుజలస్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టుల విస్తరణను చేపడుతున్నదని, వెంటనే ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, టీజీపీ ప్రాజెక్టుల విస్తరణను తీవ్రంగా ఆక్షేపించారు.
పునర్విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ర్టాలు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా, అప్పటికే వినియోగంలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించినా ముందుగా కేఆర్ఎంబీ, లేదంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని, ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల విస్తరణను చేపడుతున్నదని, టెండర్లను ఆహ్వానించిందని వెల్లడించారు. ఇప్పటికైనా ఏపీ సర్కారును నిలువరించాలని, పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.