హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారం లో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సలం చెరువు ఎఫ్టీఎల్తోపాటు ఆక్రమణలు, విద్యాసంస్థల నిర్మాణాలకు, తరగతుల నిర్వహణకు అనుమతులు, బాధ్యులైన అధికారులపై చర్యలు తదితరాలపై నివేదికలు సమర్పించాలంటూ ఆయా శాఖలకు మూడు నెలలు గ డువు ఇచ్చినా స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరిగా మరో వారం గ డువు ఇస్తున్నామని, 9లోగా నివేదికలు దాఖ లు చేయని పక్షంలో ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
సలం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. విద్యాశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థలో తరగతుల నిర్వహణకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని తెలిపా రు. హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వాదన లు వినిపిస్తూ ఆ చెరువు లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సలం చెరువులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి అన్ని శాఖల నుంచి రావాల్సిన పత్రాల కోసం చూస్తున్నామని హైడ్రా తరఫు న్యాయవాది చెప్పారు. ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు మరో 4 వారాల గడువు కావాలని కోరారు.
నీటిపారుదల శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మే 15న ఉమ్మడి తనిఖీ నిర్వహించామని, రెవెన్యూ అధికారుల నుంచి సెచ్ అడిగామని, అది వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యా యవాది అభ్యంతరం వ్యక్తంచేస్తూ 2016 లోనే ఎఫ్టీఎల్ నిర్ధారణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిందని తెలిపారు. దీని ప్రకా రం 34.25 ఎకరాల్లో చెరువు ఉందని, ఎఫ్టీఎల్ పరిధిని 39.30 ఎకరాలకు పెంచారని చెప్పారు. రెవెన్యూశాఖలోని పహాణీ ప్రకారం సర్వే నం.62/1లో 36.3 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉన్నదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నివేదికలు సమర్పించడానికి మరో వారం గడువు ఇస్తున్నామని, ఒకవేళ దాఖలు చేయకపోతే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందంటూ విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.