సూర్యాపేట, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘కరోనా సెకండ్ వేవ్పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని ప్రజలు నమ్మవద్దు. కరోనా విషయంలో ప్రతీఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జనరల్ దవాఖాన సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 50 పడకల మాతాశిశు సంక్షేమ భవనాన్ని మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి అధికారులతో ఈటల సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులకు సరిపడా ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో లేవని కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, సరిపడా మందులు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉన్నా దాన్ని ఎదుర్కొనేందుకు, ఎంతైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలను కాపాడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్యారోగ్యశాఖ ఉద్యోగులపై ఉందని చెప్పిన మంత్రి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల మందికి టెస్టులు చేశామని, 2.74 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని వివరించారు. త్వరలోనే రాష్ర్టానికి అధునాతన రాపిడ్ టెస్టుల మిషన్లు రాబోతున్నాయని, వాటితో రోజుకు 10 లక్షల మందికిపైగా కరోనా టెస్టులు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దవాఖానల్లో ఖాళీ బెడ్లు చాలానే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు పదికిపైగా బెడ్లు ఉన్న ప్రైవేట్ దవాఖానలను ప్రభుత్వాధీనంలోకి తీసుకున్నామని వివరించారు. అర్బన్ ప్రాంతాల్లోని యువతలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాల డీఎంహెచ్ఓలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.