హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టే క్రమంలో తాసిల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు కట్టబెట్టేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మార్పులు చేసిందన్న అంశంపై ధరణి పునర్నిర్మాణ కమిటీ ఆరా తీసింది. బుధవారం ఈ కమిటీ సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్ఐఐసీ అధికారులతో భేటీ అయ్యింది. ధరణి పోర్టల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతోపాటు వాటి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయేతర భూముల తరహాలో ఇండ్ల వద్దకు వెళ్లి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసేలా చట్టంలో వెసులుబాటు ఉన్నదా? అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ అధికారులు మాట్లాడుతూ.. ల్యాండ్ బ్యాంక్లో తమకు 60 వేల ఎకరాల భూములు ఉండగా ధరణి పోర్టల్లో 25 వేల ఎకరాలు మాత్రమే నమోదైనట్టు చెప్పారు. దీంతో మిగతా 35 వేల ఎకరాలు ఎందుకు నమోదు కాలేదని కమిటీ ప్రశ్నించింది. సమావేశంలో కమిటీ సభ్యులు కోదండరెడ్డి, మధుసూదన్, సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ సుభాషిణి, డీఐజీ రవీందర్రావు, రిజిస్ట్రార్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ధరణి పునర్నిర్మాణ కమిటీలో మరో సభ్యునిగా ఉన్న సునీల్ కుమార్ తండ్రి సంజీవరెడ్డి ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సునీల్ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. బుధవారంతో తమ సమావేశాలు తాత్కాలికంగా ముగిసినట్టు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన అంశాలతో త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని కమిటీ భావిస్తున్నది.