Minister Indrakaran Reddy | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో హరితోత్సవానికి సంబంధించిన పోస్టర్ను అటవీశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గత తొమ్మిదేళ్లుగా హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు, విజయాలను వివరించే రెండు పోస్టర్లును అటవీశాఖ తయారు చేసింది.
పెద్ద ఎత్తున కోట్లాది మొక్కలు నాటడం, రహదారి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల ఏర్పాటు, అటవీ పునరుద్ధరణలో భాగంగా అడవుల లోపల చేపట్టిన కార్యక్రమాలను పోస్టర్లలో పొందుపరిచారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రభుత్వ కార్యాలయాల్లో హరితహారం విజయాలను ప్రదర్శించేందుకు అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 19న హరితోత్సవం సందర్భంగానే తొమ్మిదో విడత హరితహారం ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.
ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు ఎంత ప్రత్యేకమో.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అంతే విశిష్టత కలిగి ఉన్నాయన్నారు. 33శాతం పచ్చదనం సాధన కోసం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటోందన్నారు. ఈ పథకానికి దక్కుతున్న ప్రతి అవార్డు, గుర్తింపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంపునకు అందరూ పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.