అభివృద్ధి పేరుతో అడవుల విధ్వంసం తగదంటూ ఎన్జీవోలు చేసిన ఉద్యమాలు చూశాం. అడవుల సంరక్షణ పేరిట ప్రభుత్వాలు ప్రకటించిన విధానాలు చూశాం. గతాన్ని చూస్తే.. ఉన్న అడవులను కాపాడుకోవడానికి ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వాల విధానాలు రూపొందాయి. ఎన్జీవోలు, ప్రజా సంఘాల ఉద్యమాలైనా.. ప్రభుత్వాల విధానాలైనా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలే ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి, చెట్ల ఆవశ్యకతను వారికి వివరించడానికి జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. దేశ చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం విశిష్టమైన, వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టింది. అడవుల నరికివేతతో పుడమి తల్లికి అయిన గాయాలను మాన్పించడమే కాదు. పచ్చని చెట్లతో ‘పచ్చల హారం’ తొడగడానికి సిద్ధమైంది. హరిత నిధిని ప్రకటించింది. నిజానికి ఈ ప్రయత్నం హరితహారంతోనే మొదలైనా.. హరిత నిధిలో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా ఈ పచ్చల హారాన్ని ప్రజల చేత తయారు చేయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. 2015లో ప్రభుత్వం హరితహారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 217 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకొన్నది. దాదాపు లక్ష్యానికి చేరువైంది. ఈ పథకం ఫలితంగా తెలంగాణలో అటవీ విస్తీర్ణం 3శాతం పెరిగింది.
హరిత నిధి
చెట్లు పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తకుండా, ప్రజలకు పచ్చదనంపై అవగాహన పెరిగేలా సీఎం కేసీఆర్ హరిత నిధిని ప్రకటించారు. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఈ నిధి నిరంతరాయంగా కొనసాగేలా విధివిధానాలు ప్రకటించారు. నిధిలో విద్యార్థులు, ఎన్జీవోలు, అధికారులు, సమాజం మొత్తాన్ని భాగస్వాములను చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెలా నిర్దేశించిన మొత్తాన్ని ఈ నిధికి జమ చేయాలి. వీరితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా సంస్థలు, స్కూల్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు, ఎన్జీవోలు తమకు వచ్చే విరాళాల నుంచి ఈ నిధికి డబ్బులను జమచేస్తారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, చెట్లను కాపాడుకోవడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్నో పథకాలు విధానాలు ప్రకటించాయి. వాటిలో కొన్ని…
బిష్ణోయ్ ఉద్యమం
18వ శతాబ్దంలో రాజస్థాన్లోని మార్వాడ్లో ఓ భారీ భవంతిని నిర్మించడానికి కలప కోసం ఖేజర్లీ చెట్లను నరికివేయాలని అప్పటి జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ సైనికులను ఆదేశించాడు. దీనికి జోధ్పూర్లో ఉన్న బిష్ణోయ్ తెగ ప్రజలు ఒప్పుకోలేదు. తొలుత అమృతా దేవి అనే మహిళ చెట్లను కౌగిలించుకొని సైనికులను అడ్డుకొన్నది. మిగతా వారు కూడా అలాగే చేశారు. అయితే, రాజాజ్ఞకు ఎదురు చెప్పారంటూ సైనికులు దాదాపు 360 మందిని చంపేశారు. అయినా ఉద్యమం ఆగలేదు. చివరకు రాజు దిగివచ్చాడు. ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఈ ఉద్యమం ప్రపంచపర్యావరణ సమాజానికే స్ఫూర్తిగా నిలిచింది.
చిప్కో ఉద్యమం
చిప్కో ఉద్యమం ప్రస్తుత ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో 1970ల్లో ఉద్ధృతంగా జరిగింది. దీనికి సుందర్లాల్ బహుగుణ నేతృత్వం వహించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం చమోలీలో చెట్లు నరకడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ కంపెనీకి అనుమతినిచ్చింది. అయితే బిష్ణోయ్ ఉద్యమం స్ఫూర్తితో అక్కడి ప్రజలు అటవీ విధ్వంసాన్ని అడ్డుకొన్నారు. చెట్లను కౌగిలించుకొని నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
అమెజాన్ అడవుల పరిరక్షణ
55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన అతిపెద్ద వర్షాధార అరణ్యం ‘అమెజాన్’ను పరిరక్షించుకునేందుకు బ్రెజిల్, ఐక్యరాజ్యసమితి, అమెరికా నడుంకట్టాయి. అడవిలో రేగే కార్చిచ్చులను ఎప్పటికప్పుడు కట్టడి చేయడానికి బ్రెజిల్ సైన్యాన్ని వినియోగిస్తున్నది.
గ్రీన్ ైక్లెమేట్ ఫండ్
పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ‘గ్రీన్ ైక్లెమేట్ ఫండ్’ పేరిట ఐక్యరాజ్యసమితి ఓ ఫండ్ను ఏర్పాటు చేసింది. వివిధ దేశాలు ఈ ఫండ్కు నిధులు సమకూరుస్తున్నాయి.
న్యూజిలాండ్లో వంద కోట్ల చెట్లునాటే కార్యక్రమం
2028 నాటికి దేశంలో వందకోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా ఇటీవల న్యూజిలాండ్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదివరకే పాకిస్థాన్ కూడా ఇదే పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, నిధుల్లో గోల్మాల్ ఆరోపణలు రావడంతో దీనిపై నీలినీడలు కమ్మాయి.
జర్మనీ ట్రీ బోన్ చాలెంజ్
జర్మనీ ప్రభుత్వం, ఐయూసీఎన్ సంయుక్తంగా ఈ మిషన్ను ప్రారంభించాయి. వచ్చే ఎనిమిదేండ్లలో 35 కోట్ల హెక్టార్లలో అరణ్యాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ప్రపంచ ఆర్థిక సదస్సు లక్ష కోట్ల వృక్షార్చన
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల సహకారంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష కోట్ల చెట్లను నాటాలన్నదే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.