Harish Rao | మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. ఫుడ్ పాయిజన్ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయన్నారు. వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు.
కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని.. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనమంటూ చురకలంటించారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.