సంగారెడ్డి, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): జెండా మోసే కార్యకర్త నుంచి పార్టీ ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ నేతల ఇంట వేడుకలైనా, విషాద ఘటనలు చోటుచేసుకున్నా పార్టీ నాయకత్వం వెన్నంటే ఉంటున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత తదితరులు పార్టీ శ్రేణులకు అన్నివేళలా కొండంత అండగా నిలుస్తూ వారి కష్టసుఖాలను పంచుకుంటారు. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె నివాసానికి వెళ్లి భౌతికదేహానికి నివాళులర్పించారు.
కేసీఆర్ సూచనతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు లాస్య నందిత అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వెన్నంటే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతిచెందారనే విషయం తెలిసిన వెంటనే హరీశ్రావు హైదరాబాద్లోని తన నివాసం నుంచి హుటాహుటిన బయలుదేరారు. పటాన్చెరులోని దవాఖానకు చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న లాస్యనందిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించే సందర్భంలోనూ వెన్నంటే ఉన్నారు. మరో వాహనంలో అంబులెన్స్ను అనుసరిస్తూ గాంధీ దవాఖానకు చేరుకున్నారు. గాంధీ వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా పూర్తయ్యేలా చూశారు. అక్కడి నుంచి లాస్యనందిత మృతదేహాన్ని సికింద్రాబాద్ కార్కానాలోని ఆమె నివాసానికి తరలించారు. అనంతరం లాస్యనందిత నివాసం నుంచి వెస్ట్మారేడ్పల్లిలోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర నిర్వహించగా హరీశ్రావు స్వయంగా పాడెను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. ఉదయం 8.30 గంటలకు పటాన్చెరులోని దవాఖానకు చేరుకున్న హరీశ్రావు.. రాత్రి 7.30 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు లాస్యనందిత కుటుంబసభ్యుల వెన్నంటే ఉండటం పార్టీ శ్రేణులను కదిలించింది.