హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు రెండో విడత వంద రోజుల్లో పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సాధించేందుకు కృషి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసి..నివారించగలిగే అంధత్వరహిత తెలంగాణను ఆవిష్కరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని సాకారం చేద్దామని చెప్పారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కంటి వెలుగుపై మంత్రి హరీశ్రావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మొదటి విడత కంటి వెలుగులో నిర్దేశిత కాలంలోనే 1.54 కోట్ల మందికి స్రీనింగ్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించామని, 50 లక్షల కండ్లద్దాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఉచితంగా కండ్లద్దాలు, మందులు అందిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమమైనా ప్రజల కోణంలో ఆలోచించి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రూ.200 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
సూక్ష్మస్థాయి ప్రణాళికలు సిద్ధం
కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు 8 నెలల్లో పూర్తి చేశామని, రెండో విడతను వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం బృందాల సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. మొదటి దఫా 827 బృందాలు పనిచేస్తే, ఇప్పుడు 1500కు పెంచామని వివరించారు.
12లోగా షెడ్యూల్ పూర్తి కావాలి
ఈ నెల 12లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్లలో పూర్తి చేసి షెడ్యూల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ బృందాలు, జిల్లాల్లో ఒక్కో క్వాలిటీ కంట్రోల్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పీహెచ్సీల్లో 929మంది వైద్యులను కొత్తగా నియమించామని, కాబట్టి ఇతర అరోగ్య సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని వెల్లడించారు. అనంతరం కంటి వెలుగు క్యాంపుల వివరాల బుక్లెట్ను హరీశ్రావు ఆవిష్కరించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.