హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న భారత్ టెక్స్-2024 ఈవెంట్లో మనదేశ చేనేత కళాకారులను భాగస్వాములను చేయాలని అఖిల పద్మశాలి సంఘం చేనేత విభాగం ఒక ప్రకటనలో కోరింది. ఈ మేరకు కేంద్ర చేనేత మంత్రి పీయూష్ గోయల్కు చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న గురువారం లేఖ రాశారు. ఈ ప్రదర్శనలో 3,500 మంది ఎగ్జిబిటర్లు, 3 వేల మంది విదేశీ కొనుగోలుదారులు, 40 దేశాల నుంచి 40 వేల మంది పెట్టుబడిదారులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
85 శాతం చేనేత దుస్తులు మనదేశంలోనే ఉత్పత్తి అవుతున్నందున, ఈ కార్యక్రమం మన సాంసృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వేదికగా దోహదపడుతుందని తెలిపారు. చేనేత కళాకారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని, ప్రయాణ, వసతి సహాయం అందించాలని కోరారు. చేనేత కళాకారుల విజయగాథలను ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని, జాతీయ అవార్డు గ్రహీతలనూ ఆహ్వానించాలని, ఈవెంట్కు హాజరయ్యే విదేశీయులు చేనేత క్లస్టర్లను సందర్శించేలా చొరవ చూపాలని కోరారు.