రెండోసారి ఎన్నిక లాంఛనమే
రేపు మండలి చైర్మన్ ఎన్నిక.. నేడు నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్, మార్చి 12 : శాసనమండలి చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ఎన్నిక కానున్నారు. చైర్మన్ స్థానానికి ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. 9 నెలలుగా ఖాళీగా ఉన్న మండలి చైర్మన్ ఎన్నిక కోసం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నరసింహాచార్యులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం 10.30 నంచి సాయంత్రం 5 గంటల వరకు శాసనసభ సచివాలయం ప్రాంగణంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సోమవారం ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశమై చైర్మన్ను ఎన్నుకొంటుంది. ఈ స్థానానికి గుత్తా ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉన్నది. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే బ్యాలెట్ పద్ధతితో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇద్దరి అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా ఎన్నుకొనే అకాశం ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నికవుతారనేది త్వరలోనే తేలనున్నది.
9 నెలలు ఇద్దరు చైర్మన్ ప్రొటెమ్లు
శాసన మండలికి గత 9 నెలల్లో ఇద్దరు చైర్మన్ ప్రొటెమ్లుగా వ్యవహరించారు. చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్ చైర్మన్గా నేతి విద్యాసాగర్ పదవీ కాలం గతేడాది జూన్ 4తో ముగిసింది. రెండు పదవులు ఒకేసారి ఖాళీ కావటంతో చైర్మన్ ప్రొటెమ్ నియామకం అనివార్యమైంది. దీంతో సభలో సీనియర్ అయిన వెన్నవరం భూపాల్రెడ్డి చైర్మన్ ప్రొటెమ్గా జనవరి 4 వరకు కొనసాగారు. ప్రస్తుత చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ జనవరి 13న బాధ్యతలు చేపట్టారు. సోమవారం కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు.