హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో జర్నలిస్టులతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బీజేపీ నేత కావడంతోనే బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే అధికార పార్టీని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు తప్పవన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ రాజగోపాల్ రెడ్డిని వాడుకొంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని చెప్పుకునేందుకు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందన్నారు. కేసీఆర్ ప్రధాని అయ్యేందుకు ఏ పార్టీని అయినా కలుపుకుంటామని ఆయన చెప్పారు. మునుగోడులో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదు. అందుకనే ఇతర పార్టీల నేతలను ప్రలోభాలు పెట్టే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. మునుగోడులో ఫ్లోరోసిస్ వ్యాధికి మిషన్ భగీరథ ద్వారా వాటర్ వచ్చిన తరువాతే విముక్తి కలిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.