హైదరాబాద్, జనవరి1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు లక్ష్యం దిశగా సాగుతున్నాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. నూతన ఏడాదిలోనూ సరికొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పయనించాలని ఆకాంక్షించారు.
గురుకుల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం గర్వంగా ఉన్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడచిన ఏడాదిలో అనేకమంది నిరుపేద విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలు, యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించారని గుర్తుచేశారు. గురుకులాలకు చెందిన 128 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు, 46 మంది ప్రీమియర్ ఐఐటీలు, 82 మంది ఎన్ఐటీల్లో అడ్మిషన్ పొందారని వివరించారు. గురుకుల విద్యార్థులు క్రీడల్లోనూ సత్తాచాటుతున్నారని ముగ్గురు అంతర్జాతీయ, 87 మంది జాతీయ, 281 మంది రాష్ట్రస్థాయి పతకాలు సాధించారని తెలిపారు.
ఒలింపియాడ్స్లో శ్రీచైతన్య ప్రతిభ
హైదరాబాద్, జనవరి1 (నమస్తే తెలంగాణ): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్(ఐఏపీటీ) నిర్వహించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్ ఒలింపియాడ్స్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 100 మంది విద్యార్థులు నేషనల్ లెవల్ ఒలింపియాడ్కు ఎంపికయ్యారని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు, డైరెక్టర్ సుష్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్లో 27 మంది, కెమిస్ట్రీలో 30, బయాలజీలో ఇద్దరు, ఆస్ట్రానమీలో 30 మంది, మ్యాథ్స్లో 11 మంది చొప్పున ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థులకు, అందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు.