Gurukula Recruitment | హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ): గురుకుల నియామకపత్రాలు అందుకొని పోస్టింగ్ ఆర్డర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థుల అయోమయానికి తెరపడింది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు ట్రిబ్ (తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు) స్పష్టం చేసింది. దీంతో పోస్టింగ్ ఆర్డర్పై ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరట లభించింది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన ట్రిబ్ ఇటీవలే అందులో 8,708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. 8,304 పోస్టులను భర్తీ చేసింది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, లైబ్రేరియన్ క్యాటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులను సొసైటీలకు కేటాయిస్తూ నియామక పత్రాలను సీఎం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా గత నెల 15న ఒకదఫా, ఈ నెల 4న మరో దఫా ఎల్బీ స్టేడియం వేదికగా అందజేసింది.
అలాట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన సొసైటీల్లో రిపోర్టు చేస్తే అక్కడ మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆలస్యమవుతున్నాకొద్దీ ఆ ప్రక్రియను చేపట్టకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ లోగా లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిపడింది. ఈ కోడ్ ముగిసిన అనంతరమే అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ను అందజేస్తామని, అభ్యర్థులు అపోహాలను, వదంతులను నమ్మవద్దని ట్రిబ్ అధికారులు తాజాగా వెల్లడించారు. దీంతో గురుకుల అభ్యర్థులకు ప్రస్తుతం భరోసా లభించింది.
అభ్యర్థులందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు
ట్రిబ్ అన్ని పోస్టుల అభ్యర్థులకు ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తుది జాబితాను ప్రకటించినా వారిలో కొందరికి అలాట్మెంట్ ఆర్డర్లను ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు, రంగారెడ్డి జిల్లాలోని అభ్యర్థులకు నియామకపత్రాలను ఇవ్వలేదు. ఆ కోడ్ ప్రస్తుతం కొనసాగుతుండగానే సాధారణ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దివ్యాంగ కోటా అభ్యర్థుల నియామక ప్రక్రియ కూడా పూర్తికాలేదు.
ఇటీవలే వారి వైద్య పరీక్షలను పూర్తిచేసినా అలాట్మెంట్ ఆర్డర్లను ఇవ్వలేదు. వారందరినీ సొసైటీలకు అలాట్ చేయాల్సి ఉన్నది. ఆ తర్వాతే అందరికీ ఒకేసారి సొసైటీలు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టనున్నాయి. లేదంటే ఇప్పటికే నియామకమైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తే తదుపరి అలాట్మెంట్ పొందే అభ్యర్థులు సర్వీస్లో జూనియర్లుగా పడే ప్రమాదమున్నది. వారికి ప్రమోషన్లలో ఇబ్బందికరంగా మారే అవకాశమున్నది.
హైకోర్టు తీర్పు మేరకు నియామకాలు చేపట్టండి: గురుకుల అభ్యర్థుల వినతి
హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులోని మార్గదర్శకాలకు అనుగుణంగా గురుకులాల నియామక ప్రక్రియ చేపట్టాలని పలువురు గురుకుల అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రిబ్ చైర్మన్ను గురుకుల అభ్యర్థులు తూము మనోహర్, ప్రమోద్, మహేందర్, కాశీతోపాటు పలువురు గురువారం ప్రత్యేకంగా కలిశారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీతోపాటు వినతిపత్రం అందజేశారు. మిగిలిపోతున్న ఉద్యోగాలన్నిటినీ తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ మేరకు అధికారులు సైతం సానుకూలత వ్యక్తం చేశారని వారు వెల్లడించారు.