హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ నాలుగు సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం మే 8న నిర్వహించిన వీటీజీసీఈటీ-2022 ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం విడుదల చేశారు. మొత్తం 48,440 సీట్లకు లక్షా 47 వేల 924 మంది బాలబాలికలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.38 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. సీట్లకు క్యాటగిరీలవారీగా అర్హులైన విద్యార్థుల జాబితాను మంత్రి ప్రకటించారు.
అనంతరం గురుకుల విద్యాసంస్థల సొసైటీల ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గురుకులాల పనితీరుపై గంటన్నరపాటు చర్చించారు. గురుకులాలకు మరింత వన్నె తెచ్చేందుకు అంకితభావంతో ముందుకు సాగుదామని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్, బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, అధికారులు హన్మంతునాయక్, సర్వేశ్వర్రెడ్డి, చంద్రకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.