హైదరాబాద్/సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కోఠిలోని ఈఎన్టీ దవాఖానను బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నుంచి బయటపడిన తరువాత బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కు గురైన రోగులకు ఈఎన్టీలో చికిత్స అందిస్తారని చెప్పారు. మల్టీడిసిప్లినరీ చికిత్స కోసం గాంధీ దవాఖానకు, కంటి సమస్యలపై సరోజినీదేవి కంటి దవాఖానకు రిఫర్ చేస్తారని రమేశ్రెడ్డి తెలిపారు. మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా దవాఖానల సూపరింటెండెంట్లను ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ బాధితులు నేరుగా కోఠి ఈఎన్టీ దవాఖానను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.బ్లాక్ ఫంగస్ వ్యాప్తి నివారణకు
వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతున్నది.
ఫంగస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే నివారణ చర్యలను మార్గదర్శకాల రూపంలో అన్నిజిల్లాల డీఎంహెచ్వోలతోపాటు ప్రైవేటు దవాఖానలకు శనివారం పంపించింది. వీటిని తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయాలని, స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్స్ వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించింది. ఆక్సిజన్ థెరపీలో భాగంగా శుభ్రత పాటించాలని, స్టెరైల్ వాటర్ ఉపయోగించాలని పేర్కొన్నది. ఆక్సిజన్ థెరపీ సమయంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్లే బ్లాక్ ఫంగస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన ఆరోగ్యశాఖ.. ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీని ప్రకారం.. డిస్టిల్డ్ లేదా స్టెరైల్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో మరిగించిన నీరు, మినరల్ వాటర్ వినియోగించకూడదు. పరిమితి రేఖ కంటే 10 ఎంఎం తక్కువగా నింపాలి. వాటర్ లెవల్ను ప్రతి రోజు రెండుసార్లు తనిఖీ చేయాలి. అవసరమైతే వాటర్ నింపాలి. హ్యుమిడిఫైర్ను రోజూ సబ్బు నీటితో శుభ్రంచేసి వెంటనే ఆరబెట్టాలి. రోజూ నీటిని మార్చాలి. వారానికి ఒకసారి యాంటీసెప్టిక్ ద్రవంలో 30 నిమిషాలపాటు ఉంచి, తర్వాత శుభ్ర పర్చుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది.
బాన్సువాడ/చింతకాని, మే 15 : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నేరడకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం కరోనాబారిన పడి కోలుకున్నాడు. కంట్లో ఇన్ఫెక్షన్ రావటంతో ఈ నెల 9న ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానకు వెళ్లాడు. వైద్యులు పరీక్షించి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. బాన్సువాడకు చెందిన కొమ్మ శ్రీనివాస్ నెల రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఇటీవల కంటిచూపు మందగించడంతో పలు దవాఖానల్లో చూపించుకొన్నాడు. ఎమ్మాఆర్ఐ స్కానింగ్ చేయించడంతో బ్లాక్ ఫంగస్ సోకినట్టు తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరాడు.
బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖానలో బ్లాక్ ఫంగస్కు అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. మధుమేహం అధికంగా ఉండి నియంత్రణ లేనివారికి, కరోనా తగ్గినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వ్యాధి నిరోధకశక్తి తగ్గినవారికి బ్లాక్ ఫంగ స్ సోకుతున్నదని క్యాన్సర్ వైద్యులు తెలిపారు. తొలిదశలో గుర్తించి శస్త్రచికిత్స, తగిన మందులు వాడటం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య నిపుణుల బృందాలతో చికిత్సను అందిస్తామని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్నవారు ఇతర సమాచారం కోసం 040-2355 1235, 2355 6655 ఫోన్నంబర్లలో సంప్రదించాలని కోరారు.