Gruhalakshmi | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’కి లైన్ క్లియరైంది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. సొంత జాగా ఉన్న పేదలకు మూడు దశల్లో రూ.3 లక్షలు (పూర్తి సబ్సిడీ) మంజూరు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించింది. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3,000 ఇండ్ల చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. మార్గదర్శకాల ప్రకారం.. ఇంటిని లబ్ధిదారు ఇష్టమొచ్చిన డిజైన్లో నిర్మించుకోవచ్చు. అయితే, కనీసం 2 గదులు, ఒక టాయ్లెట్ కచ్చితంగా ఉండాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఇండ్ల మంజూరు
ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తుంది. మంజూరైన ఇండ్ల కన్నా ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉంటే వెయిటింగ్ లిస్ట్ను రూపొందించి అనంతరం మంజూరైన ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తారు. నిర్మాణ పురోగతిని మండల, సర్కిల్ కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లులను జిల్లా కలెక్టర్కు పంపిస్తుంది. ఆమోదం తర్వాత రాష్ట్ర నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారు బ్యాంక్ ఖాతాకు నేరుగా నిధులు బదిలీ అవుతాయి. నిర్మాణ పురోగతి, అయిన వ్యయం ఆధారంగా దశలవారీగా నిధులు మంజూరు అవుతాయి.
గృహలక్ష్మికి పోర్టల్, యాప్
గృహలక్ష్మి పథకం అమలుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ (టీఎస్హెచ్సీఎల్) ఆధ్వర్యంలో, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేకంగా పోర్టల్తోపాటు మోబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తారు. ఇండ్ల మంజూరు, బిల్లులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే సాగుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్, రూఫ్ లెవల్, అనంతరం పూర్తయ్యాక మొత్తం మూడు దశల్లో ఫొటోలు తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూఫ్ లెవల్ పూర్తయ్యాక రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష మంజూరు చేస్తారు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను లబ్ధిదారు పేర తెరుస్తారు. జన్ధన్ ఖాతాను దీనికి ఉపయోగించరు. టీఎస్హెచ్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్రస్థాయిలో ఈ పథకం అమలు తీరును పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. పథకం అమలులో ఇబ్బందులు ఎదురైతే అవసరమైన మార్గదర్శకాలు జారీచేసే అధికారాన్ని మేనేజింగ్ డైరెక్టర్కు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
గృహలక్ష్మి పథకం విశేషాలు
ఇండ్లు – 3,000
అర్హతలు, అనర్హతలు ఇలా..