హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రణరంగంగా మారింది. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రుల వాహనాలపై రాళ్లు, చెప్పుల దాడితో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకొన్నది. మంత్రులపై దాడి జనసేన కార్యకర్తల పనేనని వైసీపీ ఆరోపిస్తున్నది. విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా చేయాలన్న డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ‘విశాఖ గర్జన’ చేపట్టింది. ఈ కార్యక్రమానికి వైసీపీ మద్దతు పలికింది. విశాఖ అం బేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీ, సభలో వైసీపీ మంత్రులు రోజా, జోగి రమేశ్, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పా ల్గొన్నారు. అనంతరం వీరంతా విశాఖ విమానాశ్రయానికి చేరుకొన్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం విశాఖకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొన్నారు. ఈ క్రమం లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైసీపీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో మంత్రి రోజా భద్రతా సిబ్బంది లో ఒకరి తలకు గాయమైంది. వైవీ సుబ్బారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొంతకాలంగా పవన్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులను చూసి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడే రాళ్లదాడి జరిగింది. జనసేన కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు.