హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం.. సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్ విధానంలో భేటీ జరిగింది.
తెలంగాణ తరఫున సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము సమర్పించిన డీపీఆర్ల గురించి త్వరగా తేల్చాలని తెలంగాణ అధికారులు కోరారు. గెజిట్లో మార్పుల విజ్ఞప్తులను త్వరగా పరిశీలించాలన్నారు. మేడిగడ్డ ఆనకట్ట, దేవాదులను బోర్డు పరిధిలో చేర్చే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే సీలేరు, ఇతర కాంపోనెంట్ల బోర్డు పరిధిలో చేర్చే అంశంపై భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.