కాటారం/గోవిందరావుపేట, ఫిబ్రవరి 12: వన్యప్రాణుల వేటకు దుండగులు విద్యుత్తు తీగలతో బిగించిన ఉచ్చుకు ఇద్దరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కమాండో, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఓ ప్రైవేట్ ఉద్యోగి మరణించారు.
ఈ రెండు ఘటనలు కూడా ఆదివారమే జరిగాయి. వివరాలు ఇలా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం, మంగళవారం సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మేడిగడ్డ పర్యటనకు వస్తుండటంతో జాతీయ రహదారి వెంట కాటారం శివారు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజోలుగూడ గ్రామానికి చెందిన 2012 బ్యాచ్ గ్రేహౌండ్స్ విభాగం జూనియర్ కమాండర్ ఆడే ప్రవీణ్ (34) సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్కొట్టింది. గ్రేహౌండ్స్ కమాండోలు ప్రవీణ్ను 108 అంబులెన్స్లో భూపాలపల్లికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే విద్యుత్తు ఉచ్చు బిగించిన వారిలో ఒకరిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపిల్లగూడేనికి చెందిన పిండి రమేశ్ (28) ప్రైవేట్ ఉద్యోగి. తన స్నేహితుడు అనిల్కు చెం దిన గొర్రెలు తప్పిపోవడంతో వెతకడానికి ఆదివారం సాయంత్రం అడవిలోకి వెళ్లారు. అక్కడ వేటగాళ్లు జంతువులను చంపేందుకు అమర్చిన విద్యుత్తు తీగలకు రమేశ్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రమేశ్కు ఐదు నెలల క్రితమే పెండ్లి అయింది. ఆ కుటుంబంలో అతడు ఒక్కడే సంతానం. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.
కానిస్టేబుల్ ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకొంటాం
హైదరాబాద్ : గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కూంబింగ్ క్రమంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.