హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎనిమిదేండ్లలోనే స్వల్ప కాలంలో చేపట్టిన వ్యవసాయరంగ అభివృద్ధి, అనుసరిస్తున్న వినూత్న విధానాలు.. దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేశాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ‘జాతీయ రైతు దినోత్సవం’ (కిసాన్ దివస్)ను పురసరించుకొని దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అనేంతగా వ్యవసాయరంగ మార్పునకు తెలంగాణ బాటలు వేసిందని తెలిపారు. దండుగలా మారిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చడంతో పాటు, దేశానికే అన్నపూర్ణగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించడం వెనుక ఎంతోశ్రమ, మేధోమథనం దాగి ఉన్నదని పేర్కొన్నారు.
కేంద్రం అడ్డంకులను అధిగమిస్తూ మున్ముందుకు ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ, కేంద్రం రాజ్యాంగబద్ధమైన బాధ్యతను విస్మరించి, ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తూ రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు నిరంతరాయంగా కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి సమస్త రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని, తద్వారా దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయంలో అభివృద్ధి వల్ల అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతున్నదని, అది ‘స్పిన్ ఆఫ్ ఎకానమీ’కి దారి తీసి తద్వారా సుస్థిరాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ స్ఫూర్తితో దేశంలో కిసాన్ సర్కార్
వ్యవసాయంలో చోటుచేసుకొనే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, దాని ప్రభావం, ద్వితీయ, తృతీయ రంగాలైన పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి సమస్త రంగాల్లో వృద్ధిరేటు ఊహించనిరీతిలో నమోదవుతూ అటు తలసరి ఆదాయం, ఇటు జీఎస్డీపీ పెరుగుదలకు దోహదం చేసిందని తెలిపారు. విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలువృత్తుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం వెచ్చించే ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందనే శాస్త్రీయ ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న రైతు సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్ఫూర్తితో దేశంలో కిసాన్ సరార్ అధికారంలోకి రావాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ మాడల్ ద్వారా మాత్రమే దేశ రైతాంగం, వ్యవసాయరంగం ఎదురొంటున్న సమస్యలకు అసలైన పరిషారం లభిస్తుందని పునరుద్ఘాటించారు.