హైదరాబాద్ : మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అద్భుతంగా ముందుకు సాగుతున్నది. కాలాల్ని, సంస్కృతుల్ని, పండగల్ని తనలో మిలితం చేసుకొని కొత్త ఆలోచనలతో ప్రకృతి ప్రేమికులను కదలిస్తుంది. అందులో భాగంగానే నిర్వాహకులు. ‘ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు’ నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా గురువారం శృంగేరిలోని జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షినామ్నాయ శారద పీఠంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. చెట్ల ఔన్నత్యాన్ని చాటేలా, భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని, జమ్మి మొక్కను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రతినిధి మఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామీజీకి అందజేశారు.
అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మహోన్నతమైందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైందన్నారు.
అంతరించిపోతున్న జమ్మి మొక్కను నాటాలనే వారి అభినివేశానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. వారి కృషికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని సహృదయంతో ఆశ్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మఠంలో సీఈఓ పద్మశ్రీ గురుసేవ దురిన, డాక్టర్ వి.ఆర్.గౌరీ శంకర్, మఠం సాధువులు, పూజారులు, ఇతర భక్తులతో కలిసి జమ్మి మొక్కను నాటారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ బాధ్యులు కర్ణాకర్ రెడ్డి, రాఘవతో పాటు మఠం బాధ్యులు, సాధువులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.