హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలతో రాష్ట్రంలో హరిత విప్లవంతోపాటు క్షీర విప్లవం కూడా మొదలైందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేవలం వ్యవసాయరంగమే కాకుండా దాని అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సమాఖ్య (నార్ముల్) ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు బుధవారం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నాయకత్వంలో ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. వారిని కేటీఆర్ అభినందించారు. మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గతంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ను కలిసినవారిలో నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, కొత్త డైరెక్టర్లు జయశ్రీ, అలివేలు, జలంధర్రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, శ్రీధర్రెడ్డి, సరేందర్రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.