హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అమరావతిలో ఉన్న వెల్లూరు ఇన్స్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)లో శనివారం యూనివర్సిటీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వార్షిక నివేదికను కూడా విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు.
తమ నాలుగు క్యాంపస్లలో 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్స్లర్ డాక్టర్ వీ విశ్వనాథన్ తెలిపారు. విద్యార్థులకు విలువలతో కూడిన సృజనాత్మక, పరిశోధనాత్మక విద్యను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ బోనం, వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డాక్టర్ అనుపమా నంబూరు తదితరులు పాల్గొన్నారు.