హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీలో ప్రతి రెండు నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామ రికార్డులన్నీ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచాలని, వాటికి గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలని తెలిపింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ల విధులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పారిశుధ్యం పనులను పర్యవేక్షించాలని, తాగునీటి సరఫరాలో నాణ్యత పాటించే విధంగా, ఇంటింటికి తాగునీటిని అందించే విధంగా చేయాలని సూచించింది. విద్యుత్ చార్జీలను ప్రతి నెలా చెల్లించాలని, గ్రామ పంచాయతీ స్థాయిలో ఇచ్చే అనుమతులన్నింటిని ఆన్లైన్లో ఇవ్వాలని ఆదేశించింది.