హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షలు ఈ నెల 4, 5తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు ఉంటాయి. ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల నిమిత్తం గేట్ను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది విద్యార్థులు గేట్ పరీక్షకు హాజరుకానున్నారు. గేట్లో మంచి ర్యాంకు సాధిస్తే ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు. అదేవిధంగా, మూడేండ్లపాటు 32 కేంద్రప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఈ స్కోర్ను పరిగణనలోకి తీసుకొంటారు. ఇటీవలికాలంలో సాఫ్ట్వేర్ బూమ్ క్రమంగా తగ్గుతుండటంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్నారు. పరిశోధనా రంగంలో రాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గేట్ రాసే వారి సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్రంలో గేట్ రాసే వారిసంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 11కు పెంచారు. ఇదివరకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడలోనే పరీక్ష కేంద్రాలుండగా, తాజాగా ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు అనుమతించారు. ఈ పరీక్షల మాక్టెస్ట్ పేపర్లను ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గేట్ రెండో విడత పరీక్షలను ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహిస్తారు.