హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు త్వరలో ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్ కానున్నాయి. ఈ గ్రేడ్లపై సంతృప్తిలేకపోయినా సర్దుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశాలు తక్కువని చెప్తున్నారు. కరోనా రెండోదశ నేపథ్యంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ పాస్చేస్తూ, ఫార్మేటివ్ అసెస్మెంట్-1 ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే విద్యార్థులు ఈ మార్కులపై సంతృప్తికరంగా లేకపోతే పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. సీబీఎస్ఈని అనుసరిస్తూ మన రాష్ట్ర అధికారులు సైతం మార్కులపై అసంతృప్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యపడదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కరోనా రెండోదశ తీవ్రత నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని చెప్తున్నారు. తాము జారీచేసే గ్రేడ్లు విద్యార్థులకు నష్టం కలిగించవని, విద్యార్థులంతా సంతోషపడేలా గ్రేడ్లు జారీచేయబోతున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. పరీక్షలు మాత్రం నిర్వహించే అవకాశాల్లేవని అభిప్రాయపడ్డారు.
మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటే పరిస్థితి మొదటికొచ్చినట్టే. పరీక్షలు రాయాలనుకునేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, హాల్టికెట్ల జారీ, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల విడుదల చేయాలంటే కష్టమని అధికారులు అంటున్నారు. అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని, పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు.