న్యూఢిల్లీ, జూలై 22: పార్శీ యువత ఆన్లైన్ డేటింగ్ను, తద్వారా వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలను పునరుద్ధరించింది. వేగంగా పడిపోతున్న పార్శీల జనాభాను పెంచే లక్ష్యంతో గతంలో ప్రభుత్వం జియో పార్శీ పథకాన్ని ప్రారంభించింది. కొవిడ్ అనంతర కాలం లో చేపట్టిన ఆన్లైన్ డేటింగ్ మధ్యలో కౌన్సెలర్లు అందుబాటులో లేని కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో ఆన్లైన్ కౌన్సెలింగ్ను పునరుద్ధరిస్తున్నట్టు ఈ పథకం అమలులో పాల్గొంటున్న పార్జోర్ సంస్థ డైరెక్టర్ షెర్నాజ్ కామా చెప్పారు.
పార్శీ వయోజనుల్లో అధికులు పెండ్లి మీద ఆసక్తి చూపకపోవడం వల్లనే వారి జనాభా నిరంతరంగా తగ్గితున్నది. సుమారు 30 శాతం పార్సీ యువత పెండ్లికి దూరంగా ఉండిపోతున్నారు. పార్శీ జంట సగటు సంతానోత్పత్తి రేటు 0.8 గా ఉంది. ఈ దృష్ట్యా పార్శీ యువతను పెండ్లి చేసుకొని, పిల్లలను కనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కామా అన్నారు. ఏటా సగటున 800 మంది పార్శీలు చనిపోతే, జననాలు మాత్రం 200 నుంచి 300 లోపే ఉంటున్నాయి. దేశంలో పార్శీల మొత్తం జనాభా 1941లో 1,14,000 ఉండగా 2011 నాటికి అది 57,264కు తగ్గిపోయింది. దీంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ 2013లో జియో పార్శీ పథకాన్ని ప్రారంభించింది. పార్శీ యువత, ముఖ్యంగా పార్శీ మహిళలు స్వతంత్ర జీవనం కోరుకోవడమే పెండ్లిళ్లకు వారు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. 30 శాతం మంది పార్శీలు 65 ఏండ్లు పైబడినవారే. వారి ఆలనా పాలనా చూసుకోవాలన్న కారణంగా కూడాపార్శీ యువతులు పెండ్లిళ్లు చేసుకోవడం లేదు. సంవత్సరానికి రూ.10 లక్షల లోపు సంపాదించేవారికి ప్రభుత్వం రూ.4000 చొప్పున సహాయం అందిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని కామా తెలిపారు.