హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తున్నది. నూతన మార్కెట్లను నిర్మించింది. మార్కెట్ల నిర్వహణలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించింది. అనేక అవార్డులను సైతం గెలుచుకొన్న మార్కెటింగ్శాఖ.. అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నది.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ సామర్థ్యం గల 750 గోడౌన్లు మాత్రమే ఉండగా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా అదనపు గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. నాబార్డ్ సహకారంతో రూ.1024 కోట్లతో 364 ప్రాంతాల్లో 17.35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 457 గోడౌన్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటివరకు 347 ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం పూర్తికాగా, స్టోరేజ్ సామర్థ్యం 7.38 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 24.65 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఈ గోడౌన్లను పీడీఎఫ్ బియ్యం, ఎరువులు, ఎంఎస్పీ ఆపరేషన్లు, రైతు బంధు పథకం తదితర వాటికి ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2014-15 నాటికి తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్టర్ గోడౌన్స్, ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారెంటీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గోడౌన్స్, ప్రైవేట్ తదితర విభాగాలకు సంబంధించి 39.01 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉండగా, 2021-22 నాటికి 73.80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది.
ఈ-నామ్తో మెరుగైన సేవలు
పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ అయిన నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ నామ్)ను రాష్ట్రవ్యాప్తంగా 58 వ్యవసాయ మార్కెట్లలో అమలుచేస్తున్నారు. నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ 2017లో పీఎం ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకున్నది. 2019లో కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఈ నామ్ను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ నామ్ ద్వారా రూ.16,977 కోట్ల విలువైన 50.18 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. 18 లక్షలకుపైగా రైతులు, 5,832 మంది ట్రేడర్లు, 4,758 కమీషన్ ఏజెంట్లు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు.
మహిళా రైతులకు ప్రత్యేకంగా మార్కెట్లు
కరీంనగర్ హైవేపై కూరగాయలు విక్రయించే మహిళా రైతుల కోసం ప్రజ్ఞాపూర్, అలంపూర్ వద్ద రైతు మార్కెట్లను ప్రభుత్వం నిర్మించింది. వీటి ద్వారా ఎంతోమంది మహిళా రైతులకు, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతున్నది. రూ.20 కోట్లతో సిద్దిపేటలో రూ.22.85 కోట్లతో గజ్వేల్లో, రూ.19.85 కోట్లతో సూర్యాపేటలో సమీకృత మార్కెట్లను నిర్మించారు. వీటి ద్వారా రైతులకు, వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతున్నది. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నది.
మార్కెటింగ్ శాఖ సాధించిన విజయాలు
కొత్తగా 30 రైతు బజార్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో 30 రైతు బజార్లు ఉండగా, కొత్తగా మరో 30 రైతు బజార్లను మంజూరు చేశారు. ప్రస్తుతం 47 రైతు బజార్లు పనిచేస్తుండగా, 13 రైతు బజార్ల నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉంది. సిరిసిల్ల, కూకట్పల్లిలో మాడల్ రైతు బజార్లను నిర్మించారు. బోయిన్పల్లి, ఎర్రగడ్డ మార్కెట్లలో బయో గ్యాస్ ప్లాంట్లను వినియోగించడంతోపాటు గుడి మల్కాపూర్, బాటసింగారంలో ప్లాంట్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది. బోయిన్పల్లిలో ప్రతిరోజూ 10 టన్నుల వ్యర్థాన్ని వినియోగించి బయోగ్యాస్, విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. వినియోగదారులకు, రైతులకు సత్వర సేవలు అందించాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ ఈ-లైసెన్స్, ఈ-పర్మిట్, ఈ-పేమెంట్స్, ఈ-రిసిప్ట్ లాంటి సేవలను కూడా ప్రారంభించింది.