Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్లపై చర్యలు తీసుకోవడంపై వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
టీటీజీడీఏ, ఇతర వైద్య సంఘాల పిలుపు మేరకు సోమవారం టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా దవాఖానలు, వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేస్తున్న వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన నిరసన తెలిపారు. ఇద్దరు వైద్యలను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆగ్రమం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆ దవాఖానలో లేని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్పై చర్యలు తీసుకోవడమేంటని నిలదీశారు.
రోగికి ఎలుక కరిస్తే శానిటేషన్ ఏజెన్సీ బాధ్యత వహించాల్సి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. డాక్టర్లు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. కామారెడ్డి ఘటనలో శానిటేషన్ ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి డాక్టర్లను సస్పెండ్ చేయడాన్ని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA) ఖండించింది.
ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా వెంటనే కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. అయితే, ఈ ఘటనలో సస్పెన్షన్కు గురైన అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్ ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్లోని గాంధీ ఆసుప్రతిలో జరుగుతున్న 2019 ఎంబీబీఎస్ బ్యాచ్ పరీక్షలకు ఎగ్జామినర్గా హాజరైనట్లు గాంధీ మెడికల్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది. ఆసుపత్రిలో లేకపోయినా చర్యలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.