మొత్తం ఉద్యోగ ఖాళీలు – 1,36,534
పదోన్నతుల ద్వారా భర్తీచేసేవి – 48,654
మిగిలిన ఉద్యోగాల ఖాళీలు – 87,880
ప్రమోషన్లతో ఏర్పడే ఖాళీలు దాదాపు – 5,000
హైదరాబాద్, మార్చి 10 : ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. అందులో 1.91 లక్షల ఖాళీలు ఉన్నట్టు పేర్కొనడంతో విపక్ష నేతలకు తాయిలం దొరికినట్టయింది. నిరుద్యోగులను గందరగోళంలోకి నెట్టేందుకు అర్థరహితమైన ఆరోపణలకు దిగుతున్నారు. నిరుద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించి, అపోహలు కల్పించేందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఈ గోబెల్స్ ప్రచారాలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో స్పష్టతనిచ్చింది. విపక్షాల తీరును ఎండగడుతూ మంత్రి హరీశ్రావు సవివరంగా గణాంకాలతో సహా స్పష్టమైన నివేదికను గురువారం మండలిలో వెల్లడించారు.
ఉన్న ఖాళీలు 1.36 లక్షలు
పీఆర్సీ నివేదికలో 1.91 లక్షల ఖాళీలు ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ పేర్కొన్నారు. వాస్తవిక లెక్కల ప్రకారం మొత్తం ఖాళీలు 1.36 లక్షలు. వీటిలో పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులు 48,654. వీటిని మినహాయిస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులు 87,880. ప్రస్తుతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంఖ్య 80,039.
జీరోగా చూపిన కమిటీ
ఉద్యోగుల వేతన సవరణ కోసం 2018లో తెలంగాణ సర్కారు సీఆర్ బిశ్వాల్ కమిటీని నియమించింది. ఉద్యోగుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిటీ 2020 డిసెంబర్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పీఆర్సీ నివేదికలోనే కొన్ని అంకెల పొరపాట్లు దొర్లాయి. దీన్ని పీఆర్సీ కమిటీలో పనిచేసినవారు గమనించలేదు. స్వతంత్ర ప్రతిపత్తి ఉండే సంస్థల్లో (ఉదాహరణకు ప్రభుత్వ గ్రాంట్లపై, ఇతర నిధులపై నడిచేవి) ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం మంజూరుచేసిన ఉద్యోగాల్లో చూపించారు. ఇలా చూపినవి 54,118 ఉద్యోగాలున్నాయి. మంజూరు చేసిన ఉద్యోగాల్లో వీటి లెక్కను చూపిన పీఆర్సీ.. ఆయా సంస్థల వర్కింగ్ స్ట్రెంత్లో ఉన్నట్టు చూపించకుండా మొత్తానికి మొత్తం సున్నాగా చూపించింది. మరికొన్ని వివరాలను కూడా తప్పుగా పేర్కొన్నది. పూర్తి నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ పొరపాట్లు స్పష్టంగా అర్థమవుతాయి. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న వారు, ఖాళీల వివరాల్లో తేడాలున్నాయి. వాటి వివరాలిలా ఉన్నాయి.
ఉద్యోగుల వివరాల్లో జీరోలు
రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ రకాలకు చెందిన మొత్తం 211 శాఖలు, సంస్థల నుంచి మొత్తం ఉద్యోగుల వివరాలను పీఆర్సీ సేకరించింది. వీటిల్లో ప్రభుత్వ శాఖలు, హెచ్వోడీలు, సంస్థలను అన్నీ కలిపి చూపారు. కానీ, పలు శాఖలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు కావడంతో వాటిలో వర్కింగ్ స్ట్రెంత్ను జీరోగా చూపించారు. ఇలా 45 సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యను సున్నాగా చూపారు. మంజూరైన పోస్టుల్లో ఈ సంఖ్యను పొందుపరిచిన పీఆర్సీ.. వర్కింగ్ స్ట్రెంత్లో సున్నాగా పేర్కొన్నది. దీంతో ఖాళీల సంఖ్య భారీగా కనబడుతున్నది. వాస్తవానికి ఆయాశాఖల్లో ఉద్యోగులున్నారు. పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారికి వేతనాలిస్తున్నది. వైద్య విధాన పరిషత్లో 10,283, మైనార్టీ గురుకులాల్లో 6,579, బీసీ గురుకులాల్లో 8,340, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 4,909, నిమ్స్ 3,184, ఉస్మానియా యూనివర్సిటీలో 1,957, వ్యవసాయ వర్సిటీలో 2,156 పోస్టులున్నాయి. ఇలా 45 సంస్థల్లో వర్కింగ్ స్ట్రెంత్ను జీరోగా చూపించారు. ఇలాంటివి 54,118 పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వారి సంఖ్యను పీఆర్సీ కలిపి చూపించలేదు. దీంతోనే వర్కింగ్ స్ట్రెంత్ తగ్గి, ఖాళీల సంఖ్య పెరిగినట్టు కనిపించింది.
ఖాళీలు 87,880 పోస్టులే
రాష్ట్రంలో మొత్తం మంజూరైన 4,90,258 పోస్టుల నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లోని 54,118 పోస్టులను మినహాయించగా మంజూరైన పోస్టుల సంఖ్య 4,36,140 మాత్రమే. వీటిలో ప్రస్తుతానికి 2,99,606 ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే ఖాళీల సంఖ్య 1,36, 534 తేలుతుంది. వీటిలో పదోన్నతులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కలిసి ఉంటాయి. పదోన్నతుల ఖాళీలు 48,654 తీసేస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 87,880 మాత్రమే. వీటిలో 80,039 పోస్టులను భర్తీచేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇదీ లెక్క. వాస్తవాలిలా ఉంటే విపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయి.